Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూలు విదిలిస్తున్నారు. టోటల్ బలగాన్నంతా రెడీ చేస్తున్నారు. దొరికినోడిని దొరికినట్టు ఫైన్లు బాదేయడమే. ఏమాత్రం గీత దాటినా.. వేలల్లో జరిమానా విధించడమే. తప్పదు మరి.. అట్లుంటది మాతోని అంటున్నారు సిటీ ట్రాఫిక్ బాస్.
రాంగ్ రూట్ కి 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్ 1200 ఫైన్ వసూలు చేస్తామని.. హైదరాబాద్ లో రూల్స్ మరింత కఠినం చేస్తామని.. ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ అన్నారు. వాహనాన్ని బట్టి ఫైన్ మారుతుందట. ఎక్కువ విధ్వంసం జరిగేందుకు అవకాశం ఉండే భారీ వాహనాలకు ఎక్కువ మొత్తంలో ఫైన్ విధించనున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా పట్టుబడితే.. ఆ వాహనంపై గతంలోనూ ఏమైనా చలాన్లు ఉన్నాయా? లేవా? అనే విషయాలను బట్టి కూడా ఫైన్ మొత్తం పెరుగుతుందని చెప్పారు.
రాంగ్ రూట్లో రావడం, ట్రిపుల్ రైడింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయని.. అందుకే ఆ రెండు రూల్స్ బ్రేక్ చేస్తే వెయ్యికి పైగా ఫైన్ ను పెంచేశామని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 28 నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ చేపడతామని జాయింట్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
ట్రాఫిక్ చలాన్లు పెంచడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపైనా స్పందించారు రంగనాథ్. ట్రాఫిక్ చలాన్లను ఆదాయ వనరుగా ఎప్పుడూ చూడలేదని.. రోడ్డు ప్రమాదాలు నివారించడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నారు. ప్రభుత్వమే పోలీసు శాఖకు రూ.వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తోందని చెప్పారు.