Team India : భారత్ -న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. రెండో టీ20లో భారత్ చెలరేగి ఆడి విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించేందుకు సన్నద్ధమవుతోంది. మూడో టీ20ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు టీమిండియా తహతహలాడుతోంది. అటు కివీస్ కూడా ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్ లోపాలు..
రెండో మ్యాచ్ గెలిచినా భారత జట్టులో అనేక లోపాలు బయటపడ్డాయి. బ్యాటర్లలో వరల్డ్ కప్ నుంచి సూర్యకుమార్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. గత మ్యాచ్ లో సూర్య అద్భుత సెంచరీ బాదడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. కానీ మిగతా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ గా వచ్చిన పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. క్రీజులో ఉన్న కాస్త సమయం కూడా పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. వరల్డ్ కప్ లో అవకాశం దక్కని శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. చివరి ఓవర్ లో బరిలోకి దిగిన దీపక్ కూడా డకౌట్ అయ్యాడు. హుడా వరల్డ్ కప్ లోనూ ఇచ్చిన ఒక్క అవకాశం వినియోగించుకోలేకపోయాడు. అప్పుడు కూడా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. రెండో మ్యాచ్ లో విఫలమైన బ్యాటర్లు చివరి మ్యాచ్ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే కెప్టెన్ హార్థిక్ పాండ్యా కూడా బ్యాట్ కు పని చెప్పాల్సిందే.
బౌలర్లు అదే జోరు కొనసాగిస్తారా?
గత మ్యాచ్ లో భారత్ బౌలర్లు గొప్పగా రాణించారు. పేసర్ భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. మరో పేసర్ మహమ్మద్ సిరాజ్ , స్పిన్నర్ చాహల్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్ లో విఫలమైనా దీపక్ హూడా బౌలింగ్ లో అద్భుతమే చేశాడు. కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. గత మ్యాచ్ లో అర్షదీప్ దారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. మూడో మ్యాచ్ లో అర్షదీప్ మెరవాలి. మరో స్పిన్నర్ సుందర్ పరుగులు ఎక్కువ ఇచ్చినా ఒక వికెట్ తీశాడు. మొత్తంగా పేస్ , స్వింగ్ బౌలింగ్ కు అనుకూలించే కివీస్ పిచ్ పై భారత్ స్పిన్నర్లే 7 వికెట్లు తీశారు. మూడో టీ20లోనూ బౌలర్లు అదే జోరు కొనసాగిస్తేనా భారత్ సిరీస్ కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
కివీస్ కు ఛాలెంజ్..
న్యూజిలాండ్ కు మ్యాచ్ కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలిమ్సన్ కు మెడికల్ అపాయింట్ మెంట్ ఉండటంతో మూడో మ్యాచ్ కు అందుబాటులో ఉండటంలేదు. దీంతో పేసర్ టీమ్ సౌథీ జట్టుకు సారథ్యం వహిస్తాడు. కేన్ విలిమ్సన్ ప్లేస్ లో మార్క్ చాపమన్ కు అవకాశం కల్పించారు. రెండో టీ20లో కెప్టెన్ తప్ప అందరూ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్లు ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే ఫామ్ లోకి వస్తే వాళ్లని ఆపటం భారత్ బౌలర్లకు కత్తిమీద సామే. అలాగే హిట్టర్లు గ్లెన్ ఫిలిప్, డరెల్ మిచెల్, జేమ్స్ నీషమ్ టచ్ లోకి వస్తే కివీస్ భారీ స్కోర్ సాధించడం ఖాయం. అటు బౌలర్లలో గతమ్యాచ్ లో సౌథీ ఒక్కడే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అది కూడా ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ తో మెరిశాడు. పేసర్లు ఆడమ్ మిల్నె, లూకీ ఫెర్గూసన్ విఫలమయ్యారు. స్పిన్నర్లో ఇష్ సోధీ ఒక్క వికెట్ తీసినా.. శాంట్నర్ కు మాత్రం వికెట్ దక్కలేదు. కివీస్ జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో మెరుగు పడాల్సిఉంది.