Balaraju: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఫాంహౌజ్ కేసు ఆ నలుగురిలో ఒకరు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. 100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోని జాతిరత్నం. కీలకమైన కేసు కావడంతో.. ఆ రోజు నుంచి వారాల తరబడి ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లోనే ఉంచేశారు సీఎం కేసీఆర్. మీడియా కంట పడకుండా.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో బంధీ చేశారంటూ ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినా.. వారిని బయటకు విడిచిపెట్టలేదు. చాలాకాలం తర్వాత తాజాగా ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ నుంచి స్వేచ్ఛ లభించింది. వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఉన్నారు.
ఆయన చేసింది మామూలు ఘనకార్యమా? 100 కోట్లు కాదనుకున్న మహానుభావుడు. నిఖార్సైన గులాబీ సైనికుడు. అందుకే, తమ నాయకుడికి నియోజకవర్గంలో ఘన స్వాగతం పలకాలని భావించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ మేరకు పై నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అంతకుముందు గువ్వల బాలరాజుపై ఫ్లెక్సీ వార్ సైతం నడిచింది. ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలిస్తే.. ఈ ప్రాంత అభివృద్ధికి వేల కోట్ల నిధులు తీసుకొచ్చారంటూ కౌంటర్ ఫ్లెక్సీలు కట్టారు. ఈ హడావుడి మధ్యే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన ఇలాఖాలో అడుగుపెట్టేశారు.
తాజాగా, అచ్చంపేటలో ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అమ్మవారికి 22 తులాల బంగారు వడ్డానాన్ని సమర్పించారు బాలరాజు దంపతులు. సోమవారం ఆ వడ్డానాన్ని వాసవి మాతకు అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు.
ఫాంహౌజ్ కేసు, ప్రగతి భవన్ క్యాంపు, అచ్చంపేటలో గ్రాండ్ ఎంట్రీ, అమ్మవారికి బంగారు వడ్డాణం. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జోరు మామూలుగా లేదంటున్నారు స్థానికులు. ప్రగతి భవన్ నుంచి విముక్తి లభించినందుకా? ఫాంహౌజ్ కేసుతో స్టేట్ వైడ్ పాపులారిటీ వచ్చిందనా? ఎందుకింత హడావుడి అంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.