Update on HCU Student Rohit Vemula Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్ డీ స్టూడెంట్ రోహిత్ వేముల కేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోహిత్ కేసును క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. రోహిత్ దళితుడు కాదని, ఈ కేసును మూసివేస్తున్నామంటూ పోలీసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆత్మహత్యకు గల కారణాలు, ఎటువంటి ఎవిడెన్స్ లేవని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల కుటుంబానికి తెలంగాణ హైకోర్టు సూచించింది.
ఈ పరిణామంపై రోహిత్ వేముల సోదరుడు స్పందించారు. పోలీసుల వాదన నిజం కాదన్నారు. ఈ సందర్భంలో తన భావాలను ఎలా వ్యక్తపరుచాలో అర్థంకావడంలేదన్నారు. ఈ కేసుకు 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని, కుల ధృవీకరణ అంశానికి సంబంధించి 2017లోనే పోలీసులు విచారణను నిలిపివేశారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబం కలిసి ఈ కేసు విషయంలో తమకు న్యాయం దక్కేలా చూడాలని కోరనున్నట్లు ఆయన రోహిత్ సోదరుడు తెలిపారు.
Also Read: తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు
వేముల రోహిత్ ఘటన 2016 జనవరిలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన విషయం తెలిసిందే. దళితుల పట్ల యూనివర్సిటీల్లో వివక్ష కొనసాగుతోందంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం విధితమే. హెచ్ సీయూలో విద్యార్థులు చాలా రోజులపాటు నిరసన వ్యక్తం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని.. దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంది.. వివక్ష చూపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక అలాంటి వివక్ష కొనసాగకుండా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
విద్యార్థుల నిరసనల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు దళిత సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని వారికి మద్దతు తెలిపిన విషయం విధితమే. ఇటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా వెళ్లి వారికి మద్దతు తెలిపి తాము అధికారంలోకి వచ్చినంక పూర్తి స్థాయిలో విచారణ జరిపి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు.