Vijayawada West Assembly Constituency: బెజవాడ వెస్ట్ సెగ్మెంట్లో మాజీ కేంద్రమంత్రితో ఒక మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యేగా పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. రకరకాల ట్విస్ట్ల మధ్య వెస్ట్ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లి .. మాజీ ఎంపీ సుజనాచౌదరి ఆ పార్టీ అభ్యర్ధిగా స్క్రీన్ మీదకొచ్చారు. అప్పటికే అక్కడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లిని సెంట్రల్కు పంపి. షేక్ ఆసిఫ్ను ఇన్చార్జ్గా ప్రకటించింది వైసీపీ. ఎన్డీఏ నుంచి అన్ని విధాలా బలమైన అభ్యర్ధి తెరపైకి రావడంతో వైసీపీ అభ్యర్ధిని మారుస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే ముస్లీం ఓట్ల లెక్కలతో ఆయన్నే అభ్యర్ధిగా ప్రకటించిన వైసీపీకి.. సుజనా స్ట్రాటజీలు మింగుడు పడటం లేదంట.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పక్కా కమర్షియల్ సెంటర్.. వన్టౌన్ని తనలో ఇముడ్చుకుని ఉన్న ఆ సెగ్మెంట్ వల్లే బెజవాడకు వ్యాపార రాజధాని అన్న పేరు వచ్చింది. హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరైన అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే క్లాస్, మాస్ కలిసి ఉండే ఆ సెగ్మెంట్లో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. 1967 నుంచి ఇప్పటికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయిదుసార్లు గెలుపొందింది. కామ్రెడ్లు మూడు సార్లు జెండా పాతారు. పీఆర్పీని కూడా ఆదరించిన వన్టౌన్ ఓటర్లు వైసీపీకి రెండు సార్లు పట్టం గట్టారు.
టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒక్కసారే విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలిచింది. ఆ క్రమంలో కొన్ని సార్లు కామ్రెడ్లు, ఈ తర్వాత బీజేపీతో పొత్తులతో టీడీపీకి అక్కడ పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు .. అలాంటి చోట ఈ సారి మిత్రపక్షాల అభ్యర్ధిగా బీజేపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనాచౌదరి బరిలోకి దిగడంతో ఇప్పుడా సెగ్మెంట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
Also Read: అప్పటివరకు టెన్షన్.. విజయం తర్వాత కావ్యమారన్ ఎగిరి..
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఈ సారి వెస్ట్లో గెలవడం అసాధ్యమని వైసీపీ సర్వేల్లో తేలింది. అందుకే ఆయన్ని జగన్ పక్కనున్న విజయవాడ సెంట్రల్కి మార్చారు వైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి ఫ్యామిలీఎరువులు, కూల్డ్రింక్స్ తదితర డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలతో ఆర్థికంగా స్థిరపడి వన్ టౌన్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్తోనే వెల్లంపల్లి శ్రీను ఒక సారి పీఆర్ఫీ నుంచి, రెండో సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ .. ఆయనకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ జగన్ కేబినెట్లో బెర్త్ దక్కేలా చేసిందంటారు.
అయితే మంత్రిగా రాజకీయ పరిపక్వత కనబర్చకుండా దూకుడు ప్రదర్శించడం ఆయనకు మైనస్ అయి సెగ్మెంట్ మారేలా చేసిందన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా అలాంటి సౌండ్ పార్టీ స్థానంలో ఈ సారి మాజీ కార్పొరేటర్, వైసీపీలో ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది వైసీపీ ఆయన సొంత సామాజికవర్గంలోని వైసీపీ నేతలతో సమన్వయం చేసుకోవడానికే టైం సరిపోతుందంట. జూనియర్ అయిన ఆసిఫ్ని పిల్లోడిలా చూస్తున్నారంట వెస్ట్ వైసీపీ నేతలు దాంతో వైసీపీ అభ్యర్ధి ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు.
Also Read: ముంబైకి చావో రేవో.. నేడు కోల్ కతాతో మ్యాచ్
ఇటు చూస్తే బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల నాయకులతో భేటీ అవుతూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైశ్యసామాజికవర్గం, ముస్లీం నేతలు ఇప్పటికే సుజనాకు మద్దతు ప్రకటించారు. టీడీపీ కీలక నేతలు ఎంకే బేగ్తో పాటు ఆయన కుమారుడు, మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్లు ఆ సెగ్మెంట్లో ముస్లీంలకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారంతా సుజనాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మరోవైపు జనసేన టికెట్ దక్కలేదని వైసీపీలో చేరిన పోతిన మమేష్ పదేపదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుండటంతో జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చిన పోతిన అక్కడ ఏం సాధించారని ఫైర్ అవుతున్నారు. వారంతా సుజనా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అదలా ఉంటే పాతబస్తీలో కొండ ప్రాంతాల ఓటర్ల ప్రభావం ఎక్కువ వారి ప్రధాన సమస్యలైన విద్య, రోడ్ కనెక్టవిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొండ ప్రాంతాల నివాసితులకు నీటి వసతి వంటి వాటిపై సుజనాచౌదరి నిర్ధిష్టమైన హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Ap Politics: ఏపీలో విచిత్ర పోరు..బరిలో మాజీ సీఎంల వారసులు
ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్నేత, కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కొండ ప్రాంత ఓటర్లలో మంచి పలుకుబడి ఉన్న బీసీ సీనియర్ నేత సోమినాయుడు ఎన్నికల టైంలో వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామాజిక వర్గానికి చెందిన తనకు వైకాపా టికెట్ ఇవ్వలేదన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధికేశినేని నాని తనను ప్రచారానికి కూడా రమ్మని కోరలేదని వైసీపీలో తనకు జరిగిన అవమానాలతో బాధపడి ఆ పార్టీని వీడారాయన ఆయన కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటం సుజనాకు మరింత ప్లస్ అవుతుందంటున్నారు. మరిలాంటి పరిస్థితుల్లో వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.