Nadendla Manohar : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన కౌంటర్ ఎటాక్ కు దిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలో జనసేనను రౌడీసేన అని సీఎం జగన్ కామెంట్ చేయడంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ అసహనం, ఆందోళనతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వీర మహిళలు, జనసైనికులను కించపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను జనసేన ప్రశ్నించినందుకే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం జగన్ కు మనోహర్ అనేక ప్రశ్నలు సంధించారు.
నాదెండ్ల సంధించిన ప్రశ్నలు
రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా?
మత్స్యకారులకు ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా?
పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?
మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా?
మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలిపినందుకా?
మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపించినందుకా?
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?
మరి నాదెండ్ల మనోహర్ సంధించిన ప్రశ్నలకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఎలాంటి సమాధానాలిస్తారో చూడాలి.