Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్ విచారణ కొనసాగించాలని తేల్చిచెప్పింది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరగాలని స్పష్టం చేసింది. సిట్పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలు ఎత్తివేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఆదేశించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్తోకూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుల తరపు న్యాయవాది తన్మయ్ మెహతా వాదించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల విన్న తర్వాత రామచంద్రబారతి సహా ముగ్గురు నిందితుల పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ దశలో ఉన్న ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్కు ఉందని సూచించింది.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోల కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ సిట్ విచారణకు హజరయ్యారు. అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్కు సింహయాజికి శ్రీనివాస్ టికెట్ బుక్ చేశారని సిట్ గుర్తించింది. శ్రీనివాస్కు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్ వివరాల ఆధారంగా శ్రీనివాస్ను ప్రశ్నించారు.