YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం బహిరంగ సభ వేదికపై టీడీపీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా పేర్కొన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని వివరించారు. కుప్పంలోనూ వైఎస్సార్సీపీనే గెలిపించారని గుర్తు చేశారు. టీడీపీ పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకున్నారని జగన్ అన్నారు. అందుకే 2019లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు శంకుస్థాపన చేశారు. నర్సాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. నర్సాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు.
గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించారని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.