ED Inquiry : చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజకీయ నేతలే టార్గెట్ గా విచారణ కొనసాగిస్తోంది. రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ , ధర్మేంద్ర యాదవ్ , ఎమ్మెల్సీ ఎల్ . రమణను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు మరికొందరిపై ఫోకస్ పెట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ను విచారిస్తున్నారు. ఈడీ నోటీసులు ఇవ్వడంతో హరీష్ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. బ్యాంక్ స్టేట్ మెంట్ లతో విచారణకు హాజరయ్యారు.
నిందితులు విదేశాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గంలో డబ్బును తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్ను విచారించిన అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. క్యాసినో కేసులో తొలివిడతలో టూర్ ఆపరేటర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3 నెలల క్రితం చాలామంది టూర్ ఆపరేటర్లను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈడీ ప్రశ్నిస్తున్న వారిలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు ఉండటం హాట్ టాపిక్గా మారింది. తలసాని పీఏ హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసులో కీలకంగా మారనుంది.
ఈడీ రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులే ఉన్నారు. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడ తమకు నోటీసులు అందుతాయో అన్న ఆందోళన చాలామంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.