Gadwal Hospital : అది జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి. కాన్పు కోసం వచ్చిన ఆ గర్భిణికి ఈ ఆస్పత్రి కడుపుకోత మిగిల్చింది. ప్రసవంలో శిశువు ప్రాణాలు కోల్పోయింది. రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా అనే గర్భిణి నెలల నిండటంతో ప్రసవం కోసం నవంబర్ 16న ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇదే తొలి కాన్పు. దీంతో సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని డాక్టర్లు చెప్పారు. ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. డాక్టర్ నర్మద, వైద్యసిబ్బంది ప్రసవం చేశారు. అయితే శిశువు మృతి చెందింది. డాక్టర్ నర్మద నిర్లక్ష్యం వల్లే పసికందు ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగింది. కాన్పు కాకముందే డాక్టర్ వెళ్లిపోయారని ఆరోపించింది.
బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను వైద్యురాలు నర్మద ఖండించారు. పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా గర్భిణి కుటుంబ సభ్యులు వినలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని స్పష్టం చేశారు.
పసికందు మృతి ఘటనపై విచారణకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. వైద్యుల తప్పిదం ఉందని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డాక్టర్ నర్మద గతంలో ఓ సారి సస్పెండ్ అయ్యారు. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో నర్మద నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు డాక్టర్ నర్మద సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.