Karnataka Auto Blast : కర్ణాటకలోని మంగళూరులో శనివారం ఓ ఆటో పేలిపోయింది. తరువాత ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. సిటీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడు గాయపడ్డాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ అక్కడికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. అయితే ఘటనకు కారణాన్ని ధృవీకరించడానికి ప్రత్యేక బృందాన్ని, ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిపించామని తెలిపారు.
ఈ ఘటనపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దని సీపీ శశికుమార్ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని పిలిపించామని, ప్రజలు ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని ఆయన అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇంటర్నెట్, మీడియా ద్వారా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు. దీనిపై విచారణ సాగుతోందని తెలిపారు.