Liger: పూరి, ఛార్మిలను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. లైగర్ లో పెట్టుబడుల గురించి ప్రశ్నించింది. దుబాయ్ నుంచి డబ్బులు రావడంపై ఆరా తీసింది. ఇండియా నుంచి దుబాయ్ కి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించి.. మళ్లీ అక్కడి నుంచి లైగర్ లో పెట్టుబడుల రూపంలో మనీ వెనక్కి తీసుకొచ్చారనేది ఆరోపణ. ఈ మనీలాండరింగ్ వెనుక ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ నేత ఎవరో రివీల్ చేశారు కాంగ్రెస్ నాయకుడు.
ఆయన పేరు బక్కా జాడ్సన్. ప్రముఖ కాంగ్రెస్ నేత. లైగర్ లో పెట్టుబడులపై ఈడీకి ఫిర్యాదు చేసింది తానేనన్నారు జాడ్సన్. ఆ సినిమాలో కేసీఆర్ కూతురు కవిత పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు లైగర్ మూవీని ఎంచుకున్నారని ఆరోపించారు. పూరీ జగన్నాథ్, కవిత, విజయ్ దేవరకొండ.. ఆ ముగ్గురూ ఒకే కులానికి చెందిన వారని గుర్తు చేశారు.
లైగర్ మూవీ నిర్మాణానికి నిధులు ఎలా వచ్చాయనే దానిపై ఇప్పటికే పూరి, ఛార్మీలను ఈడీ ప్రశ్నించింది. పలు వివరాలు రాబట్టింది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టులో నిజంగా పెట్టుబడులు పెట్టారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సమగ్ర విచారణ తర్వాత ఈడీ చర్యలు ఉంటాయని తెలుస్తోంది. తాజాగా, లైగర్ లో కవిత పెట్టుబడి పెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు బక్కా జాడ్సన్ ఆరోపించడం మరింత సంచలనంగా మారింది.