idhem kharma: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జోరు పెంచింది. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ‘బాదుడే బాదుడు’ లాంటి ప్రోగ్రామ్ తో ప్రజల్లోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ.. ఈసారి ‘ఇదేం ఖర్మ’ పేరుతో మరో నిరసన కార్యక్రమం చేపట్టింది. జగన్ సర్కారు వైఫల్యాలను, దౌర్జన్యాలను ఎండగట్టేలా ప్రజాక్షేత్రంలో మరోసారి పోరుబాట పట్టారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ‘ఇదేం ఖర్మ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. టీడీపీ గెలుపు తన కోసమో.. పార్టీ నేతల కోసమో కాదని.. రాష్ట్రాభివృద్ధి కోసమన్నారు చంద్రబాబు.
దౌర్జన్యాలు చేసిన వాళ్లపై తిరగబడితేనే దారికొస్తారని..అధికార పార్టీకి చెందిన ప్రతీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ తరహాలోనే దోచుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగిందన్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రజలను.. ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. ఈ దారుణాలన్నీ పోలీసుల సహకారంతో ప్రభుత్వమే చేసిందని మండిపడ్డారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడటం లేదని.. ఇవాళే కాదు.. రేపు అనేది కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు.