Musk Announcement : ట్విట్టర్ కొన్నాక అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఎలాన్ మస్క్… ఎట్టకేలకు కొత్త పాలసీ ప్రకటించాడు. ట్విట్టర్లో కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను వెల్లడించాడు. ట్విట్టర్లో పెట్టే పోస్ట్లకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందేమో కానీ… నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని స్పష్టం చేశాడు… మస్క్. విద్వేష పూరిత కంటెంట్ ఉన్న పోస్టులను తాము ఎప్పటికీ ప్రోత్సహించబోమని క్లారిటీ ఇచ్చాడు.
తాజా పాలసీ అప్డేట్లో విద్వేషపూరిత ట్వీట్లను డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామన్నాడు… మస్క్. నెగెటివ్, హేట్ పోస్ట్లను ప్రమోట్ చేయబోమని… అవి మోనిటైజ్ పరిధిలోకి రావని, అలాంటి పోస్టులపై వినియోగదారులకు ఎలాంటి రెవెన్యూ కూడా ఉండబోదని ఖరాఖండీగా చెప్పేశాడు. అంతేకాదు.. ప్రకటనల్ని కూడా నియంత్రిస్తామన్నాడు… మస్క్. ద్వేషపూరిత, నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని మస్క్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అలాంటివి చూడాలంటే యూజర్లు ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవని చెప్పాడు.
మరోవైపు… నిషేధించిన ఖాతాల పునరుద్ధరణ కూడా ప్రారంభించాడు… మస్క్. ఇప్పటికే కొందరు యూజర్ల అకౌంట్లు యాక్టివేట్ చేసిన మస్క్… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని నెటిజన్ల అభిప్రాయం కోరాడు. దీని కోసం తన ట్విట్టర్ ఖాతాలో పోలింగ్ ప్రారంభించాడు. ప్రజల నిర్ణయాన్నే దేవుడి నిర్ణయంగా భావిస్తానని మస్క్ మరో ట్వీట్లో చెప్పాడు. ఇప్పటికే ఈ పోలింగ్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారని, దాదాపు సగం మంది ట్రంప్ ఖాతాను పునరుద్ధరణకు అనుకూలంగా ఓట్లేసినట్లు చెబుతున్నారు.
మరోవైపు తన అల్టిమేటంతో వందల మంది ఉద్యోగులు రాజీనామా చేయడంతో… సిబ్బందికి మస్క్ ఓ అత్యవసర ఇ-మెయిల్ చేశాడు. సంస్థలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెంటనే శాన్ఫ్రాన్సిస్కోకు వచ్చి తనతో వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని… ఇ-మెయిల్లో కోరాడు… మస్క్. గత 6 నెలలుగా చేసిన కోడింగ్ వర్క్కు సంబంధించిన సమ్మరీని తీసుకురావాలని ఆయన ఉద్యోగులకు సూచించినట్లు చెబుతున్నారు.