West Bengal Teachers Recruitment Scam: పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణంపై కోల్కతా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను హైకోర్టు రద్దు చేసింది.
2016లో బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన టీచర్ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించి.. నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
2016లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ స్కూళ్లలో 9, 10, 11, 12వ తరగతుల టీచర్ల పోస్టుల భర్తీకి బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసి.. పరీక్ష నిర్వహించింది. అప్పట్లో 24,650 పోస్టుల భర్తీకి గాను రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాశారు. కాగా, ప్రభుత్వం 25,753 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.
అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యర్థన మేరకు ప్రత్యేక డివిజన్ బెంచ్ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బెంచ్ కేసును విచారించి.. 2016 నియామక ప్రక్రియలో భారీ కుంభకోణాలు జరిగినట్లు నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన 25,753 టీచర్ పోస్టుల భర్తీని హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: సుప్రీం సంచలన తీర్పు.. 30 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి..
దీంతో పాటుగా ఇప్పటి వరకూ వారు తీసుకున్న జీతాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పును వెల్లడించింది. వారి వద్ద నుంచి 6 వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా స్థాయి అధికారులను కోర్టు ఆదేశించింది.