Chiranjeevi and Venkaiah Naidu got Padma Vibhushan Award 2024 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచీ అవార్డుల పంపిణీ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు 2024లో పద్మ అవార్డులను అందించనున్నట్లు ఈ ఏడాది జనవరి 25న కేంద్రం ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ అవార్డులు 110 మందికి ప్రదానం చేయనున్నారు.
పద్మ అవార్డులను అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా భావిస్తారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పద్మ అవార్డులు ఇస్తుంది కేంద్రం. విశిష్ట సేవలందించిన వ్యక్తులకు పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకోనున్న వ్యక్తుల జాబితాలో 30 మంది మహిళలూ ఉన్నారు. అలాగే 9 మందికి మరణానంతరం కూడా పద్మ పురస్కారాలు లభించాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డులను అందుకోనున్నారు.
Also Read: ఏడుగురు క్రీడాకారులకు.. పద్మశ్రీ అవార్డు..
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన చిరంజీవి.. నటనపై ఆయనకు ఉన్న అమితమైన ఆసక్తితో మద్రాసు వెళ్లారు. అక్కడ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందిన చిరంజీవి.. తొలిగా పునాదిరాళ్లు సినిమాలో నటించారు. కానీ.. నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. సినీరంగంలో చిరంజీవి చేసిన కృషిని గుర్తించిన కేంద్రం.. రెండోసారి పద్మ అవార్డుతో సత్కరించనుంది. 2006లో చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రాజకీయాల్లో విశేష సేవలందించారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉండేవారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయన.. దేశ ప్రజలకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మ విభూషణ్ ను ప్రకటించింది. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1998 నుంచి 2017 వరకూ ఎంపీగానూ సేవలందించారు.