7 Killed in Car Racing Tragedy in Sri Lanka: శ్రీలంకలో జరిగిన కార్ రేసులో విషాద ఘటన జరిగింది. ట్రాక్ పై వెళ్తున్న రేస్ కారు.. ఒక్కసారిగా ప్రేక్షకులు, అధికారులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్నవారిలో ఏడుగురు మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు. రాజధాని కొలంబోకు తూర్పున 180 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ హిల్స్ దియాతలావా పట్టణంలో.. శ్రీలంక ఆర్మీ, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్ సంయుక్తంగా ఈ కారు రేసును నిర్వహించాయి.
రేసును వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. అనుకోని ప్రమాద ఘటనతో వారంతా షాకయ్యారు. ఈ ఘటనపై పోలీస్ అధికారి నిహాల్ తల్దువా మాట్లాడుతూ.. రేస్ కార్లలో ఒకటి ట్రాక్ నుంచి తప్పి.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లినట్లు తెలిపారు. నలుగురు అధికారులు సహా ఏడుగురు మరణించగా.. గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు.. ఫెర్రీ బోల్తా.. 58 మంది మృతి!
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటన తర్వాత రేసును నిలిపివేసినట్లు చెప్పారు. శ్రీలంక ఆర్మీ, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 24 ఈవెంట్లలో ఇది 17వది అని పేర్కొన్నారు.