Poland Players Escort Security : పోలాండ్ తమ దేశ ఆటగాళ్లు ప్రయాణించే విమానానికి సెక్యూరిటీగా మరో రెండు విమానాలను పంపించింది. రెండు యుద్ధ విమానాలతో ఎస్కార్ట్ కల్పించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండడం, ఆ రెండు దేశాలు తమ పక్కనే ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఖతార్లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలలో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ కూడా పాల్గొంటోంది. అయితే, ఖతార్ వెళ్లాలంటే రష్యా, ఉక్రెయిన్ దేశాల గగనతలం నుంచి విమానం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న క్రమంలో తమ విమానంపై క్షిపణి దాడి జరిగే ప్రమాదం ఉందని పోలాండ్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ గ్రామంలో ఇటీవల క్షిపణి పడిన నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు వాళ్ల అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ ప్రయాణించే విమానానికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పోలాండ్ ప్రభుత్వం ఎస్కార్ట్ గా పంపించింది. ఆకాశంలో తమ విమానానికి తోడుగా వస్తున్న యుద్ధ విమానాలను ఆటగాళ్లు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి, యుద్ధ విమానాల పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు.