స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. ఎందుకంటే బడాబడే కంపెనీలే యూజర్ల వ్యక్తిగత వివరాలన్నింటినీ అమ్మేసేంత ధైర్యం చేస్తున్నాయి. ఒక్కసారి ఎందులో అయినా సైన్ ఇన్ అయినా… లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం వ్యక్దిగత వివరాలు ఇచ్చినా… మన డేటా మొత్తం మొత్తం సదరు యాప్ లేదా సంస్థకు చేరిపోతోంది. దాన్ని అవి ఇతర యాప్స్/కంపెనీలకు అమ్మేయడంతో.. యూజర్ల వ్యక్తిగత వివరాలన్నీ నడిబజార్లో పెట్టినట్టే అవుతోంది. ఇకపై అలాంటి చర్యలపై కొరడా ఝళిపించబోతోంది… కేంద్రం. ఎవరైనా సరే… వ్యక్తిగత వివరాలను దుర్వినియోగంపై చేస్తే… రూ.500 కోట్ల దాకా జరిమానా విధించేలా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు రూపొందించి… దాని ముసాయిదా విడుదల చేసింది.
ఈ ఏడాది ఆగస్టులో ఉపసంహరించుకున్న డేటా భద్రత బిల్లు స్థానంలో కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చింది. డిసెంబరు 17లోగా దీనిపై సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు… చట్ట రూపంలో ప్రజలకు హక్కులు, బాధ్యతలు కల్పిస్తూనే… చట్టపరమైన నిబంధనలకు లోబడి డేటా సేకరణకు అనుమతిస్తుంది. డేటా ఎకానమీని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ బిల్లు రూపొందించింది. బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు సాగేలా డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కూడా ప్రతిపాదించింది. ఇప్పుడు దేశంలో 76 కోట్ల మంది ఇంటర్నెట్ యుజర్లు ఉన్నారు. భవిష్యత్తులో ఇది 120 కోట్లకు చేరొచ్చని అంచనా. భారీ స్థాయిలో యూజర్లు పెరిగినప్పుడు డేటా వినియోగానికి సంబంధించి నిబంధనలు, చట్టాలు రూపొందించకపోతే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టే… ఇంటర్నెట్ వినియోగంపై నిబంధనలు రూపొందించడం ప్రాథమిక సూత్రంగా మారిందని కేంద్రం పేర్కొంది.
డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డాక… ఎవరైనా డేటా దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయితే… వారికి రూ.500 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. డేటా ప్రాసెసర్లు లేదా డేటా సేకరించిన సంస్థలు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల డేటా దుర్వినియోగమైతే రూ.250 కోట్ల దాకా జరిమానా విధిస్తారు. ఫిర్యాదుల పరిష్కార బోర్డును నోటిఫై చేయడంలో విఫలమైనా, చిన్నారులకు సంబంధించిన నిబంధనలు సరిగా అమలుచేయకపోయినా రూ.200 కోట్ల వరకు ఫైన్ పడుతుంది. ఒకవేళ పిల్లల వివరాలు సేకరించాలనుకుంటే, ముందు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. చిన్నారుల డేటా సేకరణ, వినియోగానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు.