YS Family War In Kadapa: తన కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయపోరాటం చేస్తూ ప్రజల ముందుకు వస్తే వైసీపీలో వణుకు పుడుతోందని వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. తన తండ్రి వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష వేయించడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న తనపై వైసీపీ నేతలు ఎదురు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మళ్లీ కేసులు పెట్టి కోర్టుల చుట్టు తిప్పుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని కలవనీయకుండా అడ్డంపడుతున్నారని విమర్శించారు. తాను ప్రజల్ని కలవలేకపోతే మన్నించాలంటూ కడప ఎంపీగా వైఎస్ షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కడప ఎన్నికల రాజకీయమంతా వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూనే తిరుగుతోంది. అటు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు. వివేకా కుమార్దె సునీత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కలిసి పాల్గొంటూ వైసీపీ అధినేత జగన్తో పాటు కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దాంతో సహజంగానే వివేకా హత్య కేసు వైసీపీని డిఫెన్స్లోకి నెడుతోంది.
ఆ క్రమంలో వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని. వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్కు జ్వరం.. ఊపిరితిత్తుల్లో నిమ్ము.. అయినా ఆగని సేనాని..
దాంతో అలా జగన్, అవినాశ్ల ప్రతిష్ఠకు భంగం కలిగించేవిధంగా, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత రియాక్ట్అయ్యారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని పులివెందులలో తాను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని ఆమె విమర్శించారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండని ఓటర్లను కోరిన సునీత ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు.
వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి గత రెండు నెలల నుంచి ప్రజల్లోకి వస్తున్న షర్మిల తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడటానికి న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డితో పాటు ఆయన తండ్రి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.