Re-Polling at 11 stations in Manipur: తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పలు పోలింగ్ స్టేషన్లలో ఘర్షణలు, ఈవీఎంల ధ్వంసం జరిగింది. దీంతో 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. హింస, కాల్పులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలు జరిగిన 2 లోక్ సభ నియోజకవర్గాల్లో సుమారు 68.62 శాతం ఓటింగ్ నమోదైంది.
ఖురాయ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మొయిరంగ్ కంపు సజేబ్, తొంగమ్ లీకై, ఛెత్రిగావ్ లలో నాలుగు పోలింగ్ స్టేషన్లు, ఇంఫాల్ తూర్పు జిల్లా థోంగ్జులో 1, ఉరిపోక్ లో 3, ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని కొంతౌజామ్ లోని 1 పోలింగ్ బూత్ లో ఘర్షణలు, ఈవీఎంల ధ్వంసం జరిగినట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఇక ఏప్రిల్ 26న ఔటర్ మణిపూర్ లో రెండోదశ ఎన్నికలు జరగనున్నాయి.
కాగా.. కాల్పుల్లో ఖోయిస్నం సనాయిమా అనే 75 సంవత్సరాల వృద్ధుడు గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలింగ్ బూత్లను ధ్వంసం చేయడం, ప్రత్యర్థి గ్రూపుల మధ్య కాల్పులు పోలింగ్ కు అంతరాయం కలిగించగా.. మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు, ఈవీఎంలు తగలబడ్డాయి.
Also Read : బీజేపీకి బిగ్ షాక్.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే.. ఎంపీ అభ్యర్థి మృతి
2019లో ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ లలోని స్థానాల్లో వరుసగా 81.12 శాతం మరియు 84.14 శాతం మంది ఓటర్లు నమోదయ్యారు. ఔటర్ మణిపూర్ (ఎస్టీ) పార్లమెంటరీ నియోజకవర్గంలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఔటర్ మణిపూర్ (ఎస్టీ) సీటు సహా మిగిలిన 13 సెగ్మెంట్లలో ఏప్రిల్ 26న రెండోదశ ఎన్నికలలో ఓటింగ్ జరగనుంది.