BCCI : సంచలన నిర్ణయం తీసుకుంది. పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని రద్దు చేసింది. కొత్త సెలక్టర్ల కోసం ప్రకటన కూడా ఇచ్చింది. ఆసియాకప్ సహా T20 ప్రపంచకప్లోనూ టీమిండియా ఘోర పరాజయానికి, సెలెక్టర్ల కమిటీ నిర్ణయాలు కూడా ఓ కారణమని భావించిన BCCI.. కఠిన నిర్ణయం తీసుకుంది.
నిన్నటి వరకు మాజీ క్రికెటర్ చేతన్ శర్మ చైర్మన్గా ఉన్న సెలక్షన్ కమిటీలో… సౌత్ జోన్ నుంచి సునీల్ జోషి, సెంట్రల్ జోన్ నుంచి హర్విందర్ సింగ్, ఈస్ట్ జోన్ నుంచి దెబాషిశ్ మొహంతి సభ్యులుగా ఉన్నారు. ఆసియాకప్ టోర్నీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాతే సెలక్షన్ కమిటీని రద్దు చేసి కొత్త సెలెక్షన్ కమిటీని నియమించాలని BCCI భావించినా… T20 ప్రపంచకప్కు ముందు మార్పులు చేయడం మంచిది కాదని ఆగిపోయింది. T20 ప్రపంచకప్కి కూడా ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం, సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో… సెలక్షన్ కమిటీని మార్చాలనే నిర్ణయానికి వచ్చింది… BCCI.
సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన BCCI.. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్లు సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు… కనీసం 7 టెస్టు మ్యాచ్లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు… లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలని బీసీసీఐ నిబంధన పెట్టింది. అలాగే, క్రికెట్ నుంచి 5 ఏళ్ల కిందటే రిటైర్మెంట్ తీసుకుని ఉండాలని స్పష్టం చేసింది.
మరోవైపు అభిమాలు మాత్రం… సెలక్షన్ కమిటీపై వేటు వేసినట్లే హెడ్ కోచ్ సహా ఘోరంగా ఆడుతున్న ఆటగాళ్లను కూడా జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలను వారి బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటున్నారు. అలా చేస్తేనే T20ల్లో టీమిండియా ఆటతీరు మెరుగుపడుతుందని అంటున్నారు.