డిసెంబర్లో జరగబోయే ఐపీఎల్-2023 మినీ వేలం కోసం… ఫ్రాంచైజీలన్నీ కొందరు ఆటగాళ్లను వదులుకోగా.. మరికొందర్ని జట్టులోనే పెట్టుకున్నాయి. ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లలో ఈసారి ఎక్కువ మంది స్టార్లు ఉండటం… అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే, కోట్లు పోసి కొన్న ప్రముఖ ఆటగాళ్లు కూడా అన్ని సీజన్లలోనూ విఫలమవుతూ వస్తుండటంతో… ఓపిక నశించిన ఫ్రాంచైజీలు… అలాంటి ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేశాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన ఆటగాళ్లలో… న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. ఇప్పుడతణ్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది… పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. నిరుడు జరిగిన వేలంలో మయాంక్ అగర్వాల్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేసింది… పంజాబ్. జట్టుకు ఏకంగా కెప్టెన్ ని కూడా చేసింది. కానీ… మయాంక్ దారుణంగా విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్ లు ఆడి… కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో… అతణ్ని వదిలేసిన పంజాబ్.. ఇప్పుడు కేన్ మామ వైపు చూస్తోంది. T20 వరల్డ్ కప్ లో కివీస్ టీమ్ ను సెమీస్ దాకా చేర్చిన కేన్ విలియమ్సన్ ను రూ.10 కోట్లు పెట్టి అయినా కొనాలని పంజాబ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అతడు జట్టులోకి వస్తే… కచ్చితంగా విజయపథంలో నడిపిస్తాడని నమ్ముతోంది… పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో రూ.32 కోట్లకు పైగా ఉంటడంతో… అందులో మూడో వంతుకుపైగా కేన్ కోసం ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
నిరుడు ఐపీఎల్ వేలంలో రూ.14 కోట్లకు విలియమ్సన్ను సొంతం చేసుకుంది… సన్రైజర్స్ హైదరాబాద్. అయితే ఆ సీజన్లో కేన్ మామ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటర్ గానే కాదు… కెప్టెన్ గా జట్టును కూడా విజయవంతంగా నడిపించలేకపోయాడు. దాంతో… కేన్ తో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్, రొమారియో షెపర్డ్ లను కూడా వదులుకుంది… సన్రైజర్స్ ఫ్రాంచైజీ.