Farmhouse case: బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ నెల 21న విచారణకు రావాలంటూ సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీస్ ఇష్యూ చేసింది. సిట్ విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసులో తెల్పింది సిట్.
బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు తీవ్ర సంచలనంగా మారాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. బీజేపీ కింగ్ పిన్ గా ఉన్నా సంతోష్ ను సిట్ విచారణకు రప్పించడం మామూలు విషయం కానేకాదు. బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టుంది టీఆర్ఎస్ సర్కారు.
ఫాంహౌజ్ కేసు ఆడియో, వీడియోలో బీఎల్ సంతోష్ పేరు ప్రముఖంగా వినిపించింది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజుల సంభాషణలో పదే పదే సంతోష్ ప్రస్తావన వచ్చింది. సంతోష్ కు తెలీకుండా బీజేపీలో ఏ పనీ జరగదని.. మీ విషయం సైతం ఇప్పటికే సంతోష్ కు చెప్పామని.. ఆయన ఓకే చేస్తే అమిత్ షాను కలవాల్సి ఉంటుందంటూ.. ఆ ముగ్గురు మధ్యవర్తులు ఆ ఆపరేషన్ లో సంతోషే మెయిన్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడారు. ఆ సంభాషణ ఆధారంగా డైరెక్ట్ గా సంతోష్ నే విచారించేందుకు సిట్ సిద్ధమైంది. విచారణకు రావాల్సిందిగా.. రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.
ఎవరో తన పేరు ప్రస్తావిస్తే విచారణకు తానెందుకు రావాలని సంతోష్ గౌర్హాజరు అయితే? ఆయన్ను అరెస్ట్ చేసే సాహసం సిట్ చేస్తుందా? సంతోష్ ను అరెస్ట్ చేస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఫాంహౌజ్ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోంది?