Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ఫుల్ జోష్ తో సాగుతోంది. పాదయాత్రతో రాహుల్ గాంధీకి మరింత మైలేజ్ వస్తోంది. జోడో యాత్రతో కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం రెట్టింపవుతోంది. రాహుల్ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ కు వస్తే బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జోడో యాత్రకు బాంబు బెదిరింపులు రావడానికి సావర్కర్ వివాదమే కారణమా? అని అనుమానిస్తున్నారు.
మహారాష్ట్రలో జరుగుతున్న యాత్రలో రాహుల్ గాంధీ సావర్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. సావర్కర్ బ్రిటిష్ వారికి సలామ్ చేశారంటూ.. ఆయన రాసిన క్షమాపణ పత్రాలంటూ మీడియా ముందు ఉంచడం కలకలం రేపింది. సావర్కర్ పై రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ వాదులు భగ్గుమనగా.. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా కీలక పరిణామం. ఇదే విషయంపై కాంగ్రెస్ తో పొత్తును సైతం వదులుకోవడానికి ఠాక్రే రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 20న రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో ప్రవేశించనుంది. ఆ రాష్ట్రంలోనే ఆర్ఎస్ఎస్ మెయిన్ క్యాంపస్ ఉంది. సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యల అనంతరం.. మధ్యప్రదేశ్ లో బాంబు బెదిరింపు లేఖ బయటపడటంతో దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండోర్లోని ఖల్సా స్టేడియంలో భారత్ జోడో యాత్రికులు బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. అయితే, రాహుల్ నే టార్గెట్ చేసుకున్నట్టు లేఖలో లేకున్నా.. ఎందుకైనా మంచిదని రాహుల్ గాంధీతో పాటు జోడో యాత్రకు భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు.