Kavitha: తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. మునుగోడు, ఫాంహౌజ్ కేసు, ఈడీ దాడులు, సిట్ దూకుడు, కవిత వివాదం.. ఇలా నిత్యం రాజకీయ వేడి ఎగిసిపడుతూనే ఉంది. లేటెస్ట్ కవిత ఎపిసోడ్ వీటన్నిటికంటే హైలైట్.
ఎమ్మెల్సీ కవిత కంటే కూడా కేసీఆర్ కూతురుగానే పాపులారిటీ ఎక్కువ. ఒకప్పుడు తండ్రికి తోడుగా, కేటీఆర్ కు సమానంగా తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న కవిత.. ఆ తర్వాత చాలాకాలం ప్రగతిభవన్ కు దూరమయ్యారు. కేటీఆర్ తో ఆధిపత్య పోరే అందుకు కారణం అన్నారు. ఇటీవల అంతా మళ్లీ కలిసిపోయినట్టు కనిపిస్తున్నా.. లోలోన ఫ్యామిలీ వార్ కంటిన్యూ అవుతోందని టాక్.
ఇలాంటి సమయంలో తన కూతురు కవితకు బీజేపీ గాలం వేసే ప్రయత్నం చేసిందంటూ.. స్వయంగా కేసీఆరే ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ సంచలనం అలా కొనసాగుతుండగానే.. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించడం మరింత కలకలం రేపింది. కవితతో ఇటు బీజేపీ, కవిత అటు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా? లేదంటే.. కల్వకుంట్ల కుటుంబంపై మైండ్ గేమ్ నడుస్తోందా? అనేది ఆసక్తికరం.
కవితను బీజేపీ వాళ్లు ప్రలోభపెట్టారంటూ కేసీఆర్ చెప్పడం.. ఆ విషయాన్ని కవిత సైతం మీడియా సమావేశంలో వెల్లడించడం.. చూస్తుంటే నిజమేనని అనిపించేలా ఉందని అంటున్నారు. కవితను మరో షిండేగా మార్చాలనేది బీజేపీ స్కెచ్ అనేది ఆరోపణ. అంటే, షిండేలానే కవితను సీఎం చేస్తామంటూ బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చిందా? కేసీఆర్ కు కవితకు మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టే కమలనాథులు ఆమెపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు ప్రయత్నించారా? అనే అనుమానాలు. షిండేకు చాలామంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు కాబట్టి ఆయన సీఎం కాగలిగారు. మరి, కవిత టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే ఆమె వెంట వెళ్లేదెవరు? కేసీఆర్ ను, కేటీఆర్ ను కాదని ఎమ్మెల్యేలు కవితకు సపోర్ట్ చేస్తారా? పార్టీని చీల్చేంత సత్తా ఆమెకు ఉందా? లేదంటే, కూతురే కేసీఆర్ ను వీడిపోతే ఇక ప్రజల్లో గులాబీ బాస్ పై పూర్తిగా నమ్మకం పోతుందనేది బీజేపీ ఎత్తుగడా? అసలు నిజంగానే కమలనాథులు కవితకు గాలం వేశారా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కవిత మాత్రం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. కవితనే స్వయంగా మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరుతానంటూ అడిగారని అర్వింద్ చెప్పడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదే అంశం కవితకు ఆగ్రహం తెప్పించింది. చెప్పుతో కొడతా.. కొట్టి కొట్టి చంపుతా.. అంటూ కఠిన భాష ప్రయోగిస్తూ.. కవిత తీవ్ర అసహనం, ఆగ్రహంతో రెచ్చిపోవడం.. ఆమె అనుచరులు అర్వింద్ ఇంటిపై దాడి చేయడం.. ఇదంతా చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమానం.