L.Ramana : చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఆడేందుకు ఎల్. రమణ విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి రమణ విచారణకు హాజరయ్యారు.
ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎల్ రమణ. అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈడీ కార్యాలయంలోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ వినియోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే అధికారులను రమణ మంచినీరు అడిగినట్లు సమాచారం. కళ్లు తిరిగి నీరసంగా అనిపించడంతో ఆ విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రమణ పరిస్థితి అలాగే ఉండడంతో ఈడీ అధికారులు హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 2గంటలపాటు ఈడీ కార్యాలయంలోనే ఉన్నా క్యాసినోపై రమణను అధికారులు పెద్దగా ప్రశ్నించలేదని సమాచారం.
క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై 4 నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామందిని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళ్లి పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్ ఆపరేటర్లపై జూలైలో ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వారిని విచారించింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో తనిఖీలు నిర్వహించారు. వారిద్దర్నీ ఈడీ అధికారులు గతంలోనే ప్రశ్నించారు.
తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోదరులు మహేష్యాదవ్, ధర్మేందర్ యాదవ్లను ఈడీ అధికారులు తమ కార్యాలయంలో దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించారు. అలాగే అనంతపురానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.