India’s Upcoming Rainy Season Report: భారత వాతావరణ శాఖ ప్రస్తుతం ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు సీజన్లో అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. లానినా పరిస్థితుల కారణంగా ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలానికి గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు నెలల దీర్ఘకాల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లతో పోల్చితే.. వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్లో 106 శాతం వర్షపాతం దేశంలో నమోదవ్వవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
ఈ విషయాన్ని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ సోమవారం వెల్లడించారు. 1951 నుంచి 2023 వరకు ఉన్న డేటా ప్రకారం లానినా, ఎల్నినా పరిస్థితుల కారణంగా దేశంలో 9 సార్లు అధిక వర్షపాతం నమోదైందన్నారు. గత నాలుగేళ్లలో రుతుపవనాలను సీజన్ను చూసుకుంటే.. సాధరణ, సాధరణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
Also Read: Telangana Weather : కూల్ డేస్ అయిపోయాయ్.. ఇక జర భద్రం.. హెచ్చరించిన ఐఎండీ
ఈ ఏడాది కూడా లానినా పరిస్థితుల కారణంగా దేశంలో అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. వాయువ్య, ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తాయన్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ సంవత్సరం.. జూన్ నెల నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు సీజన్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.