Arvind Kejriwal’s Next Hearing is on April 29th in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని.. ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.
ఈరోజు ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా జస్టిస్లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.అంతకుముందు తన అరెస్ట్ను కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ముందుగా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కాగా ఈ పిటిషన్ను ఢిల్లీ హై కోర్టు ఏప్రిల్ 9న తోసిపుచ్చింది.
అటు కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీం కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24 లోపు వివరణ ఇవ్వాలని సుప్రీం ఈడీని ఆదేశించింది. కాగా కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి.. కేజ్రీవాల్ను ఎన్నికల ప్రచారం నుంచి అడ్డుకునేందుకే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఏం జరిగిందో తమకు అంతా తెలుసని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..
కాగా ఈ రోజు విచారణ చేపట్టలేం అని సుప్రీం కోర్టు తెలపగానే ఈ శుక్రవారం విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. దీంతో మీరనుకున్న తేదిన విచారించడం కుదరదని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు.
అటు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియగా.. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 23 వరకు కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండనున్నారు.