350 Voters in Family: ఒక కుటుంబం. ఆ కుటుంబంలో 1200 మంది సభ్యులు. వారిలో 350 మంది ఓటర్లు. వీరంతా ఏప్రిల్ 19న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ.. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ఈ కుటుంబం గురించే యావత్ దేశం మాట్లాడుకుంటోంది. అసోంలోని సోనిట్ పూర్ జిల్లో ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఉందీ కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న ఓటర్లే ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు.
1964లో అసోంలో స్థిరపడిన దివంగత రాన్ బహదూర్ థాపాకు ఐదుగురు భార్యలు. వారందరికీ 12 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లై పిల్లలు పుట్టి.. ఆ పిల్లలకు పెళ్లిళ్లై 150 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. అలా థాపా వంశం ఇప్పుడు 1200 మందితో ఉంది. వారిలో 350 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. తమ కుటుంబం ఇప్పుడు ఆర్థిక సవాళ్లతో పోరాడుతోందని రాన్ బహదూర్ కుమారుడు టిల్ బహదూర్ థాపా తెలిపాడు.
తమ కుటుంబంలో పిల్లలకు సరైన విద్య, ఉపాధి కూడా దొరకడం లేదని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని మరొక కుమారుడు సర్కి బహదూర్ థాపా తెలిపారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో సోనిట్ పూర్ లో రాజకీయనేతలంతా ఆ ఇంటికి క్యూ కడుతున్నారు. తమకే ఓటు వేయాలంటే తమకే వేయాలంటూ ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు.
Also Read: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్..
అసోంలో 14 లోక్ సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది. సోనిట్ పూర్ లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 16 లక్షల 25 వేల మంది ఓటర్లున్నారు.