Telangana Weather Report: మండుటెండల నుంచి మధ్యలో మూడు, నాలుగు రోజులు తెలంగాణ ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది. సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక కూల్ డేస్ అయిపోయాయ్. మళ్లీ మండుటెండల కాలం మొదలైంది. నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో ఐఎండీ కీలక హెచ్చరిక జారీ చేసింది.
రానున్న రెండు, మూడు రోజుల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పెరుగుతాయని తెలిపింది. 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. మండుటెండల నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆదివారం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న రెండు రోజులు భయటకు రావొద్దు..!
మరోవైపు ఏపీలోనూ ఎండలు మాడు పగలగొడుతున్నాయి. అర్జెంటు పనులున్నా బయటకు రావాలంటే జంకాల్సిన పరిస్థితి. అసలే పెళ్లిళ్ల సీజన్. ఏప్రిల్ నెలాఖరులోగా ముహూర్తాలు చాలానే ఉన్నాయి. పెళ్లిపనులు చకచకా జరగాలంటే.. తప్పనిసరిగా బయటికి రాక తప్పదు. అలా పనులకోసం బయటికొచ్చిన వారు.. తిరిగి ఇళ్లకు చేరేసరికి నీరసించిపోతున్నారు. మండేకాలం కష్టాలు తీరాలంటే మే దాటాల్సిందే.
డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు తరచూ మంచినీళ్లు.. అందులోనూ మట్టికుండలో ఉంచిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకూ ఐస్ క్రీమ్ లు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకున్న మజ్జిగ, నిమ్మరసం, సబ్జా వాటర్ లతో పాటు.. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.