Heat Wave Alert to AP: రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. గత కొన్ని రోజులుగా మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో ఈ వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
సోమవారం రాష్ట్రంలోని 31 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని, మరో 139 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని 17 మండలాల్లో, మన్యం జిల్లాలో 03, విజయనగరం జిల్లాలోని 19 మండలాల్లో, అల్లూరి జిల్లాలో 10, విశాఖపట్నంలో 3, కాకినాడలో 16, అనకాపల్లి 18, తూర్పుగోదావరి 18, గుంటూరు 2, పల్నాడు జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 11, పశ్చిమగోదావరి 3, కోనసీమ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Chandrababu: చంద్రబాబుపై దాడికి యత్నం.. రాయిని విసిరిన ఆగంతకుడు
రానున్న రెండు రోజులు పార్వతీపురంమన్యం జిల్లాలోని 10 మండలాల్లో, శ్రీకాకుళం 9, విజయనగరం 8, అల్లూరి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, గర్భణీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.