Musk Shuts Down Twitter Offices : మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్నట్టుగా రెచ్చిపోతున్న ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కు ఇప్పుడు ఉద్యోగులు షాకివ్వ డం మొదలుపెట్టారు. రోజురోజుకూ మస్క్ వేధింపులు ఎక్కువైపోతుండటంతో… పోరా బై అని రాజీనామాలు ముఖం మీద కొడుతున్నారు. ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారని తెలియగానే మస్క్ ఏ రేంజ్ లో భయపడిపోయాడంటే… వెంటనే ట్విట్టర్ ఆఫీసుల్ని మూసివేయించాడు. మళ్లీ సోమవారం దాకా ఆఫీసులు తెరిచేది లేదంటున్నాడు… మస్క్.
కష్టపడి పనిచేస్తారా? లేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతారా? అని నిన్న ఉద్యోగులపై హుంకరించాడు… మస్క్. కష్టపడి పనిచేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ… ఇ-మెయిల్ ద్వారా ఓ ఫామ్ పంపాడు. అది చూసిన ఉద్యోగులు అవాక్కయ్యారు. ఎందుకంటే… అందులో YES అన్న ఆప్షన్ తప్ప మరొకటి లేదు. దీనికి వెంటనే రిప్లై ఇవ్వాలని మస్క్ అల్టిమేటం ఇవ్వడంతో… ఉద్యోగుల్లో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. రోజుకు 12 గంటలు పని చేయాలని చెప్పినా, అన్ని సౌకర్యాలూ పీకేసినా ఉద్యోగం చేయొచ్చు కానీ… ఆత్మాభిమానం చంపుకుని ఇలాంటివాడి దగ్గర పని చేయలేమని చాలా మంది ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ట్విట్టర్ అంతర్గత చాట్ గ్రూపుల్లో… రాజీనామాకు చిహ్నంగా సెల్యూట్ ఎమోజీలు, వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే వందల మంది మూకుమ్మడిగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఉద్యోగుల నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించని మస్క్… వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ఎంత మంది రాజీనామాలు చేశారనేది బయటికి పొక్కకుండా… తక్షణం అన్ని ట్విట్టర్ ఆఫీసుల్ని మూసివేయాలని, మళ్లీ సోమవారం దాకా ఆఫీసులు తెరవొద్దని ఆదేశించాడు. సంస్థను వీడొద్దంటూ కీలక ఉద్యోగుల్ని మస్క్ బతిమాలుతున్నాడని సమాచారం. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెబుతున్నారు. ట్విట్టర్ ని కొనగానే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా 8 వేల మంది ఉద్యోగుల్ని తీసేయడంతో పాటు మస్క్ తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలకు విసిగిపోయిన సిబ్బంది… అతని చెర నుంచి బయటపడుతున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. మొత్తానికి… ఉద్యోగుల దెబ్బకు మస్క్ మూసుకోవాల్సి వచ్చిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.