T20 World Cup 2024: ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లందరి ఆటతీరును టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అమితంగా ఇష్టపడే ఇద్దరు ఆటగాళ్లు టీ 20 ప్రపంచ కప్ కు దాదాపు కన్ ఫర్మ్ అయిపోయినట్టే అంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లఖ్ నవ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇద్దరి ఆట తీరు అందరినీ అమితంగా ఆకట్టుకుంది. వారిలో ఒకరు కులదీప్ యాదవ్ అయితే మరొకరు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ గా చెప్పుకోవాలి.
ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన లఖ్ నవ్ 20 ఓవర్లలో పడుతూ లేస్తూ 167 పరుగులు చేసింది. వీళ్లింత తక్కువ స్కోరు చేయడానికి కులదీప్ యాదవ్ ప్రధాన కారణంగా చెప్పాలి. గాయం కారణంగా దీని ముందు రెండు మ్యాచ్ లు ఆడని కులదీప్ జట్టులోకి రాగానే ధనాధన్ రెండు వికెట్లు వరుస బంతుల్లో తీసి శభాష్ అనిపించాడు. అందులో నికోలస్ పూరన్ కి వేసిన బాల్ అయితే అద్భుతమని చెప్పాలి.
నిజానికి తను వేసిన బాల్ వికెట్లను పడగొట్టడమే కాదు, ఆ వేగానికి వికెట్ సగం విరిగిపోయింది. అంటే తను వేసిన బంతిలో ఎంత వేగం ఉందో గమనించవచ్చు. అలా తను వికెట్లు తీసేసరికి మిగిలిన బౌలర్లు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు.
Also Read: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్
ఇకపోతే లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయం సాధించింది. ఇందులో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ పూర్వపు ఫామ్ అందుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫొర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచుల్లో 194 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 157.72 తో ఉన్నాడు.
అటు కులదీప్, ఇటు రిషబ్ పంత్ టీ 20 ప్రపంచకప్ లోకి ఉన్నట్టేనని అందరూ లెక్కలేస్తున్నారు.