Terrorists Attack in Balochistan : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 11 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 9 మంది పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. క్వెట్టా నుంచి తఫ్తాన్ కు జాతీయ రహదారిపై బస్సులో వెళ్తున్నవారిని అడ్డుకున్న ఉగ్రవాదులు.. వారిని బస్సులో నుంచి దింపి కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు. తొమ్మిది మంది మృతదేహాలను వంతెన సమీపంలోని కొండ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. బాధితులు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్, బహౌద్దీన్, గుజ్రాన్ వాలాకు చెందినవారిగా గుర్తించారు.
Also Read : సిడ్నీ షాపింగ్ మాల్లో దారుణం, నలుగురు మృతి
అదే దారిలో.. మరో ప్రాంతంలో కారుపై కాల్పులు జరగ్గా ఇద్దరు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రయాణికులపై ఉగ్రమూకల దాడులను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ దాడులపై అధికారులు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. మృతులకు సంతాపం తెలిపిన ఆయన.. ఉగ్రవాదులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. నోష్కీహైవేపై ఈ దారుణానికి పాల్పడిన వారిని క్షమించేది లేదని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు.
ఉగ్రమూక.. బలూచిస్థాన్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ ఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాగా.. ఈ దాడులకు ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఇటీవల బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. మాచ్ టౌన్, గ్వాదర్ పోర్ట్, టర్బాట్ లలో నిర్వహించిన దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మరణించారు.