Sukesh Letter from Mandoli Jail : మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. తీహార్ జైలులో మరో మూడు స్లాట్లను రెడీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ లను ఉద్దేశించి రాసిన లేఖలో.. వారిద్దరి సహకారంతో తీహార్ జైల్లో కేజ్రీవాల్ సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. జైలులో ఉన్న తనపై.. జైళ్లశాఖ అధికారులతో ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా.. తనపని తాను కొనసాగిస్తానని లేఖలో స్పష్టం చేశాడు. ఒత్తిడి పెరిగే కొద్దీ మరిన్ని విషయాలను బయటపెడతానని పేర్కొన్నాడు.
కేజ్రీవాల్ రాజ్యసభ సీటు కోసం తన వద్ద నుంచి రూ.50 కోట్లు తీసుకున్నాడని, ఆ డబ్బును ఫామ్ హౌస్ లో అందించిన వాట్సప్ చాట్ లు కూడా సాక్ష్యంగా ఉన్నాయని చెప్పాడు. రానున్న రోజుల్లో కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ లతో కలిపి జరిపిన వాట్సప్ చాట్ల ట్రైలర్ ను విడుదల చేస్తానని తెలిపాడు.
Also Read : కవిత కథ పెద్దదే?.. సీబీఐ కస్టడీ రిపోర్ట్ లో కొత్త విషయాలేంటి?
తీహార్ క్లబ్ లో కేజ్రీవాల్ ముగ్గురు స్నేహితులు వస్తారని, వారికోసం ప్లాటినం సభ్యత్వాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించాడు. సాక్ష్యాలను ముందుంచి విచారించే సమయంలో మనం కచ్చితంగా కలుద్దాం అని సుకేశ్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రాశాడు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. బరువు తగ్గుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. ఆయన కస్టడీలో ఉన్నప్పటికీ సలాడ్లు, పాలక్ పన్నీర్ లను ఆస్వాదిస్తున్నాడని సుకేశ్ తెలిపాడు.
కాగా.. కవిత, కేజ్రీవాల్ ల అరెస్టులకు ముందు కూడా సుకేశ్ ఇలాంటి లేఖలే రాశాడు. తీహార్ క్లబ్ కు స్వాగతం అని రాసిన లేఖలు సంచలనమయ్యాయి. లేఖలు రాసిన కొద్దిరోజుల్లోనే వాళ్లు అరెస్టయ్యారు. తాజాగా మరో లేఖ రాయడంతో నెక్ట్స్ అరెస్టయ్యేది ఎవరోనన్న చర్చ మొదలైంది.