AP Seats Exchange: ఏపీలో కూటమి మధ్య సీట్ల మార్పిడి అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ రాకముందు నేతల ఆందోళనకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు. టీడీపీ తరపున రేసులో ఉన్న పలువురు నేతలు మెట్టు దిగకపోవడంతో… కూటమి నేతలతో చంద్రబాబు జరిపిన సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ-బీజేపీ మధ్య ఒకటి రెండు సీట్లు మార్పిడి జరగనున్నా యి.
ముఖ్యంగా అనపర్తి సీటు టీడీపీ తీసుకుని, అందుకు తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వనుంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు కూటమి నేతలు శుక్రవారం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. జనసేన నుంచి పవన్, బీజేపీ నుంచి పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ పలు సీట్లపై చర్చించారు. ముఖ్యంగా అనపర్తి సీటు విషయమై హైకమాండ్తో చర్చిస్తామని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. దాదాపుగా అనపర్తి సీటు టీడీపీకి ఖాయమైనట్టేనని పార్టీ వర్గాల నుంచి బలంగా వినబడుతున్నమాట.
ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజు సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి పొత్తుల్లో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి వెళ్లింది. శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించింది కమలం పార్టీ. కానీ అక్కడ రఘురామ కృష్ణంరాజు కచ్చితంగా పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టడంతో ఈ విషయాన్ని బీజేపీ నేతల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. నరసాపురం ఎంపీ సీటుకు బదులు ఉండి నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఇస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పినట్టు సమాచారం.
అలాగే చంద్రబాబు, పవన్ సభలకు బీజేపీ కీలక నేతలు నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీనడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి నేతలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 25 లోక్సభ, 160 అసెంబ్లీ సీట్లను గెలవడమే కూటమి టార్గెట్గా పెట్టుకుంది. ఇందులోభాగంగానే స్వల్పమార్పులు చోటు చేసుకు న్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కూటమి మధ్య సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావించారు. మొత్తానికి ఈ వారంలో సీట్ల మార్పిడి అంశం కొలిక్కిరావడం ఖాయమన్నమాట.