BRS Party: వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి సుధీర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా సుధీర్ సరైన వ్యక్తిగా భావిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ నేతలు ఆమోదించారు. అయితే ఈ టికెట్ తొలుత.. ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ టికెట్ రాజయ్యకు దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా, గతంలో వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించింది. అయితే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ టికెట్ ను కేసీఆర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కేటాయించారు.