Rebels in TDP : ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా సీట్లు విషయంలో కొందరు సిట్టింగులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఆశావహులు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. టీడీపీలో రెబల్స్ బెడద ఎక్కువైంది. రాష్ట్రంలోని వివిధ చోట్ల తమకే ఎమ్మెల్యే సీట్లు కావాలంటూ టిడిపి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనలు, గొడవలు సాగుతున్నాయి.
ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజుకే సీటు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. భీమవరంలోని టిడిపి అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ ఇంటిని రామరాజు అనుచరులు ముట్టడించారు. ఉండి MLAగా రామరాజునే కొనసాగించాలని ఆందోళన చేశారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపవడవద్దని.. చంద్రబాబు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని సీతారామలక్ష్మి సర్ధి చెప్పారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్.. నారా లోకేశ్కు యాపిల్ అలర్ట్
అల్లూరు జిల్లాలోని టిడిపిలోనూ అసమ్మతి సెగ కొనసాగుతోంది. అరకులోయ టిడిపిలో టికెట్ చిచ్చు పెట్టింది. ప్రస్తుతం ఇంచార్జ్గా ఉన్న దొన్ను దొర.. తిరుగుబావుటా ఎగురవేశారు. కూటమి అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీకి సై అంటున్నారు. హైదరాబాద్లోని ఇంటికి పిలిచి MLC ఇస్తామని తనకు చెప్పినా.. చంద్రబాబును నమ్మొద్దని కేడర్ చెబుతోందని ఆయన అన్నారు. మరోవైపు.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు పాడేరు ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి ప్రకటన చేశారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీలో అసంతృప్తి నెలకొంది. కార్యకర్తల సమావేశంలో మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు కంటతడి పెట్టారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం కృషి చేశానని భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని నమ్ముకుంటే.. అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు.
Also Read : జగన్పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!
రాజంపేటలో టిడిపి అసమ్మతి నేత బత్యాలతో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. బత్యాలను రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ ప్రకటించే వ్యక్తిని తాను కాదని.. కిరణ్ కుమార్ రెడ్డి వారికి చెప్పారు. తాను వేరే పార్టీకి చెందిన వ్యక్తినని.. మీకు టికెట్ కేటాయించే వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తి అని కిరణ్ అన్నారు. బత్యాలకు హామీ ఇచ్చే పరిస్థితిలో లేక కిరణకుమార్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా అనపర్తి, ఏలూరు జిల్లా గోపాలపురం సహా అనంతపురంలోనూ టిడిపి నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వలేని పక్షంలో తమకు ప్రత్యామ్నాయం చూపాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం కచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం రెబెల్స్ను బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం.