బీజేపీ… ఈ పేరు చెబితే ముందుగా వాజ్పేయి, అద్వానీ పేర్లు బలంగా వినబడేవి. సింపుల్గా చెప్పాలంటే నిజాయితీకి మారు పేరు ఆయా నేతలు. కాలం మారింది.. నేతలు మారారు.. సిద్ధాంతాలు మారాయి. ఇప్పుడంతా మోదీ నామం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దశాబ్దం అయ్యింది. ఎన్నికల సీజన్ మొదలుకావడంతో గతంలో మాదిరిగానే ఈసారి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ.
గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిందని ఇంటా బయటా విమర్శలు ఓ రేంజ్లో వెల్లువెత్తాయి. తాజాగా ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు ప్రధాని మోదీ. ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో రాజకీయ నేతలకు సంబంధించి కేవలం మూడు శాతం మాత్రమేనని సెలవిచ్చారు. మిగతా కేసులన్నీ అవినీతి, నేరగాళ్లకు సంబంధించినవేనని తేల్చిపారేశారు. నేషనల్ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాల్సిన నాలుగు మాటలు సూటిగా చెప్పేశారు.
2014 ముందు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 25 వేల కోట్ల రూపాయలు కాగా, పదేళ్లలో ఆ మొత్తం లక్ష కోట్లకు పెరిగిందన్నారు ప్రధాని మోదీ. మూడోసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తెలిసి చాలా మంది విపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారన్నారు. తాము అధికారంలోకి వస్తున్నామని తెలిసి ఈవీఎంలపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా అవినీతిపై కఠిన చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయలేదన్నారు.
తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు ప్రధాని మోదీ. దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నాయని, కొందరు తప్పుడు కథనాలు సృష్టించారని దుయ్యబట్టారు. ఇంతవరకు బాగానే ఉందని తమ రూలింగ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుం దని చెప్పినప్పుడు, మీడియా ముందుకు రావటానికి ఎందుకు ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ప్రశ్నించారు.
గత ఎన్నికల ముందు బాలీవుడ్కి చెందిన ఓ హీరోకి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఇండియా అభివృద్ధి చెందినప్పుడు… మీడియాతో మాట్లాడటానికి ప్రధాని ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించవాళ్లూ లేకపోలేదు. నెలకోసారి మన్ కీ బాత్ అంటూ తాను చెప్పాల్సిన నాలుగు ముక్కలు రేడియో ద్వారా చెప్పేసి మమ అనిపించేస్తున్నారని సెటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి ఎన్నికల వేళ మోదీ ఇంటర్వ్యూపై విపక్ష నేతలు కూడా అదే రేంజ్లో మండిపడుతున్నారు.