Crimes in Telangana : తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో దారుణ ఘటనలు వెలుగు చూశాయి. నెలరోజుల క్రితం ఇద్దరు పిల్లల్నీ హతమార్చిన దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెంకు చెందిన పి. అనిల్ (26), దేవి (22) మార్చి 10న తమ ఇద్దరు కుమార్తెలను హతమార్చారు. కుమార్తెలు లోహిత (2), జస్విత (1) లకు పాలల్లో విషం కలిపి చంపారన్న ఆరోపణలున్నాయి.
Also Read : డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
నాటి నుంచీ పరారీలో ఉన్న దంపతులు.. తాజాగా గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరారీలో ఉన్న అనిల్, దేవిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం అడవిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరోవైపు మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ లో దారుణ ఘటన జరిగింది. సెల్ ఫోన్ విషయంలో తండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ జరగగా.. ఆవేశంతో కొడుకు రాకేశ్ తండ్రిపై దాడి చేశాడు. రాయమల్లు తలపై రోకలిబండతో కొట్టడంతో ఆయన మరణించారు. రాయమల్లు (62) సింగరేణి విశ్రాంత కార్మికుడు.