Sharmila, Sunitha shocking comment: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేనివారు.. ఇక ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత.
శుక్రవారం పులివెందులలో రోడ్ షో నిర్వహించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల… వివేకానంద హత్య జరిగి ఐదేళ్లు గడుస్తోందన్నారు. ఇప్పటివరకు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం చేయలేదని తూర్పారబట్టారు. వివేకాను గొడ్డలితో నరికి నరికి చంపినప్పుడు ఆయన ఎంత నరకం అనుభవించారోనని కంటతడి పెట్టారు. సీబీఐ విచారణలో ఎంపీ అవినాష్రెడ్డి దోషి, నిందితుడిగా తేల్చిందన్నారు. గూగుల్ టేకవుట్, ఫోన్కాల్స్ రికార్డులు, డబ్బు లావాదేవీలు జరిగినట్టు అన్నిరకాల సాక్షాలను సీబీఐ బయటపెట్టిందని గుర్తు చేశారు షర్మిల.
వైఎస్ఆర్ తమ్ముడికి ముమ్మాటికీ న్యాయం జరగలేదన్నారు వైఎష్ షర్మిల. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి హంతకులకు ఓటు వేయాలా లేదో అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఒకవైపు వైఎస్ బిడ్డ.. మరోవైపు హంతకుడు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి అవినాష్కు శిక్ష పడకుండా కాపాడారంటూ దుయ్యబట్టారు.
అంతకుముందు సునీత మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో… వైఎస్కు వివేకా అలాంటివారని, అలాంటి వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, కరవు సీమకు నీళ్లు తేవడానికి ఏం కృషి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు వేసే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని, ధర్మ వైపు ఉండాలంటే వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.