Kavitha delhi liquor case news(Today latest news telugu): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితురాలిగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గురువారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది సీబీఐ. ఈ కేసులో సీబీఐ.. న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట వాదనలు వినిపించింది.
Also Read : లోక్ సభ ఎన్నికలు.. మూడోదశ నోటిఫికేషన్ విడుదల
లిక్కర్ కేసులో కవితే కీలక సూత్రధారి అని సీబీఐ తరఫు న్యాయవాది ఆరోపించారు. విజయ్ నాయర్ తో కలిసి ఆమె ప్రణాళిక రచించారని, పక్కా ప్లాన్ ప్రకారమే ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్ లు జరిగాయని వాదించారు. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఏంటో స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ పేర్కొన్నారు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు సేకరించి ఆప్ నేతలకు అందజేశారని తెలిపారు. కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి విడతల వారిగా రూ.25 కోట్లు అందజేశారని, ఆమె వాట్సాప్ చాటింగ్ లోనూ ఇదే ఉందని సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ విషయాలన్నింటికి సంబంధించిన ఆధారాలను కూడా ఛార్జిషీట్ లో జతపరిచినట్లు తెలిపారు.
హవాలా మార్గంలో డబ్బులు తరలించినట్లు కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ అంగీకరించారని తెలిపారు. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు గోవాకు హవాలా మార్గంలో భారీగా డబ్బులు తరలించినట్లు వివరించారు. ఆ డబ్బునంతటినీ గోవా ఆప్ నేతలు అక్కడ ఎన్నికలకు వాడినట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు. ఇండో స్పిరిట్ లోనూ కవిత భాగస్వామిగా ఉన్నారని చెప్పేందుకు కూడా స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. అలాగే శరత్ చంద్రారెడ్డిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. వీరిద్దరి మధ్య రూ.14 కోట్లు లావాదేవీలు జరిగినట్లు రికార్డులు కూడా ఉన్నట్లు తెలిపారు.
Also Read : విపక్షాలకు కౌంటర్, కేవలం మూడు శాతమే
హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహించే ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఉన్నారని, ఇండోస్పిరిట్ నుంచి తనకు రావాల్సిన రూ.60 కోట్లను కవితే ఆపివేశారని శరత్ చంద్రారెడ్డి విచారణలో వెల్లడించినట్లు సీబీఐ న్యాయవాది చెప్పారు. అలాగే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే.. కవితే ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా కనిపిస్తున్నారని అన్నారు. ముగ్గురు చెప్పిన అంశాలపై కవితను మరింత లోతుగా విచారించాల్సి ఉందని, కాబట్టి ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సీబీఐ వాదనలను తప్పుబట్టారు. కవిత అరెస్ట్ కుట్రపూరితమైనదని మరోసారి ఆరోపించారు. కవిత అరెస్ట్ కోసం ఎలాంటి కేసు లేదని న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. సెక్షన్ 41ను సీబీఐ దుర్వినియోగం చేస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. సీబీఐ కవితను అరెస్ట్ చేయడంపై సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. కవితను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. మూడురోజులు కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకూ కవితను సీబీఐ కస్టడీకి అనుమతించింది.