MLC Kavitha Files a Petition Challenging CBI Arrest: ఢిల్లీ లిక్కర్ కేసు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తీహార్ జైలులో ఉన్న కవితను గురువారం (ఏప్రిల్ 11) సీబీఐ అరెస్టు చేయడం ఓ సంచలనమైతే.. ఈ అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. న్యాయమూర్తి కావేరి బవేజా ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా ? లేదా తిరస్కరిస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు అనుమతితోనే సీబీఐ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేడు కోర్టులో న్యాయమూర్తి ముందు కవితను సీబీఐ హాజరుపరచి ఏడు రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది.
కవితను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాదులు రితేష్ రాణా, మోహిత్ రావు సీబీఐ స్పెషల్ జడ్జ్ మనోజ్ కుమార్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసు పూర్వాపరాలు తనకు తెలియవని, తన వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొంటూ ఆయన నాట్ బిఫోర్ మి అన్నారు. నా ఎదుట ఎటువంటి వాదనలు జగరలేదని, నేను ఎలాంటి రీలీఫ్ ఇవ్వలేనని సీబీఐ స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకోలేనని ఆయన తేల్చి చెప్పేశారు.
Also Read: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్స్ డేటాను అందించలేం: ఎస్బీఐ
ఈడీ కేసులో తన వాదన వినిపించేందుకు కవిత రెండు నిమిషాల సమయం కేటాయించాలని గతంలో న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. ఎందుకు అనుమతి ఇవ్వాలంటూ కవితపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు గతంలో తమ వాదన వినిపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్టు కవిత తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయమూర్తి తన వాదనలు వినేందుకు తిరస్కరించడంతో కవిత ఆమెకు సుదీర్ఘ లేఖ రాసి, మీడియాకు విడుదల చేశారు.