Latest Update on Phone Tapping Case(Telangana today news) : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకదశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను విచారించిన దర్యాప్తు బృందం, రాజకీయ ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. వీరికి సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. మరోవైపు ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో నలుగురు నేతల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ నలుగురు ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-4 నిందితుడు రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టుకు అందించారు. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు బృందం నేడు మరికొందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించనుంది. ఇప్పటికే అరెస్టయిన నలుగురు నిందితుల నుండి దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ లో ఓ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం.
మరోవైపు రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. నేడు ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది.