Mumbai Indians Vs Royal Challengers Bengaluru Highlights: ఐపీఎల్ 2024 సీజన్ లో హ్యాట్రిక్ ఓటములతో దశ, దిశ లేకుండా పరిగెడుతున్న ముంబై జట్టు మళ్లీ గాడిలో పడింది. మొత్తానికి గేర్ మార్చి విజయాల ట్రాక్ ఎక్కింది. ముంబై వాంఖేడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వారిని చాకిరేవు పెట్టింది. అందరి బౌలర్లని వాయించి వదిలారు.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69) , సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 15.3 ఓవర్లలోనే 199 పరుగులు చేసి ముంబై విజయ పతాకాన్ని ఎగురవేసింది.
మొదట ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన విరాట్ అవుట్ అయిపోయాడు. తర్వాత కెప్టెన్ డుప్లెసిస్ 40 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఎట్టకేలకు రజత్ పటిదార్ ఫామ్ లోకి వచ్చి సత్తా చాటాడు. తొలి ఆఫ్ సెంచరీ సాధించాడు. అది కూడా కేవలం 26 బంతుల్లోనే సాధించాడు. అత్యద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. తర్వాత దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తానికి ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వీరిలో ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. ముగ్గురు 10 లోపే అవుట్ అయ్యారు.
Also Read: చెమటోడ్చిన పీవీ సింధు, ప్రణయ్
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి వహ్వా అనిపించాడు. గెరాల్డ్ కొయెట్జీ, ఆకాష్, శ్రేయాస్ గోపాల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం.
లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆశావాహ దృక్పథంతోనే మొదలుపెట్టింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ బ్రహ్మండంగా ఆడారు. తొలివికెట్ కి సెంచరీ పార్టనర్ షిప్ చేశారు. అది కూడా 8.5 ఓవర్లలోనే పూర్తి చేశారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
వీరికి రోహిత్ శర్మ (24 బంతుల్లో 38) మంచి సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి మొదటి బాల్ సిక్స్ కొట్టి స్టార్ట్ చేశాడు. కేవలం 6 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ (16 నాటౌట్) మ్యాచ్ ని ముగించారు.
ఆర్సీబీ బౌలింగులో ఆకాష్ దీప్, విజయ్ కుమార్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ తీశారు.
ముంబై విజయంతో పాయింట్ల పట్టికలో 7వ ప్లేస్ లోకి వెళ్లింది. ఆర్సీబీ 9వ స్థానంలోకి పడిపోయింది.