Rahul Gandhi: దేశంలోని పేదలకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని ప్రతి కుటుంబలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదరికంలో ఉన్న కుంటుంబం నుంచి ఒక మహిళకు రూ.లక్ష అందించడం ద్వారా పేదరికాన్ని ఒక్క దెబ్బతో నిర్మాలిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండే ప్రతి ఇంటికి ‘ఖటాఖట్ ఖటాఖట్’ ద్వారా ప్రతి ఏటా నెలకు రూ.8,500 మహిళల ఖాతాలో జమ చేస్తామన్నారు.
‘న్యాయ్ పాత్ర’ పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడించిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబాలోని మహిళకు ఆర్థిక స్థిరత్వం, ఆదరణ కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల కోసమే పనిచేసిందని గుర్తుచేశారు.
దేశంలో 70 కోట్ల మంది ప్రజలకంటే 22 మందే ఎక్కువ సంపద కలిగి ఉన్నారని.. దీనికి కారణం బీజేపీ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుత బీజేపీ పాలనలో దేశంలో రైతులు కనీస మద్దతు ధర, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కోసం వారు రోడ్లు పైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ఎంఎస్పీని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువతకు ఉపాధి చాలా అవసరం అని.. కానీ బీజేపీ వాటిని పట్టించుకునే స్థాయిలో లేదన్నారు. మహిళలు ధరలు పెరుగుదల నుంచి ఉపశమనం కోరుతున్నారని అన్నారు. రైతులను మోదీ ప్రభుత్వం ఉగ్రవాదుల్లా చూస్తుందని విమర్శించారు. అందుకే వారికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు.
Also Read: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్స్ డేటాను అందించలేం: ఎస్బీఐ
భారత చరిత్రలో తొలిసారిగా బీజేపీ హయాంలో రైతులు పన్నులు చెల్లించాల్సి వచ్చిందన్నారు. పెరుగుతున్న పేదరికం, రైతుల సమస్యలు, పేదల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల గురించి బీజేపీకి మాట్లాడే ఇష్టం లేకనే.. దాని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు.
అదానీ మోగా స్కామ్, ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్, పీఎం కేర్స్ ఫండ్ వంటి భారీ కుంభకోణాలకు మోదీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. మోదీ వాషింగ్ మెషిన్ లో దేశంలోని అవినీతిపరులకు క్లీన్ చిట్ లభిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను చేశారు.