6000 Indian Construction Workers Sending to Israel: గత ఆరు నెలలుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. అక్కడ నిర్మాణ రంగంలో పనిచేసే వారు కరువయ్యారు. దీంతో ఇజ్రాయెల్ నిర్మాణ రంగ కార్మికుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. భారతదేశం నుంచి ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు 6,000 మంది నిర్మాణ రంగ కార్మికులు అక్కడికి వెళ్లనున్నారు.
హమాస్ ఘర్షణలు కారణంగా ఇజ్రాయెల్ లో నిర్మాణ రంగ శ్రామికులు కరువయ్యారు. ఈ యుద్ధం నేపథ్యంలో అక్కడ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. దీంతో అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. దీంతో ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయి.
ఇప్పటివరకు ఇజ్రాయెల్ లో పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80 వేల మంది, గాజాకు చెందిన 17వేల మంది అక్కడి పనిచేస్తుండేవారు. అయితే యుద్ధం కారణంగా వారికి ఇచ్చిన అనుమతిని ఇజ్రాయెల్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కార్మికులు కొరత ఏర్పడింది. వారి స్థానాల్లో ఇజ్రాయెల్ విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది.
Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి
ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కు భారత్ నుంచి 6,000 మంది నిర్మాణ రంగ కార్మికులు వెళ్లనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ ఇజ్రాయెల్ కు తరలించనున్నారు. అయితే భారత్ నుంచి అక్కడి చేరుకునే వారికి.. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.