Kaleshwaram Project Related Medigadda Barrage is in Damage Zone: మేడిగడ్డ ప్రాజెక్టు రోజురోజుకు కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ 20వ పిల్లర్ ఇప్పటివరకు 5 అడుగులకుపైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాకుపై ఉన్న 11 పిల్లర్లలోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. గతనెల నుంచి ఇప్పటివరకు 2 ఫీట్లకు పైగా 7వ బ్లాకు సింక్ అయింది.
ప్రాజెక్టు ఫౌండేషన్లోని రాఫ్ట్ సైతం బ్రేక్ అయినట్టు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, పియర్స్ భారీగా దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలతోపాటు అనేక వైఫల్యాలు ఉన్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ దర్యాప్తులో వెల్లడైంది.
ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. పిల్లర్లు కుంగిన కారణంగా ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. నీటిని నిల్వ చేస్తే బ్యారేజ్ సామర్థ్యం దెబ్బ తింటుందని నిపుణుల బృందం హెచ్చరించడంతో కొద్దినెలల క్రితం నీటిని కిందకు వదిలేశారు.
కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయడం కన్నా కూల్చడమే బెటర్ అని నిపుణులు సూచించారు. డైమండ్ కటింగ్ పద్ధతిలో కూల్చడానికి రెండు, మూడు నెలలు పట్టవచ్చని అంటున్నారు. ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషీన్లు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బ్యారేజ్ ఫౌండేషన్పై దర్యాప్తు చేసి నివేదికివ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీని మొత్తం నీటి నిల్వ 16.17 టీఎంసీలు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఎనిమిది బ్లాకులలో 85 గేట్లను అమర్చడానికి 3వేల 625 కోట్లు వ్యయం చేశారు. బ్యారేజ్ ప్రారంభం అయిన నాలుగున్నర సంవత్సరాలకే పనికిరాకుండా పోయింది. గత ఏడాది అక్టోబర్లో 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అంతకుముందు 20వ పిల్లర్ 5 ఫీట్లకు పైగా లోతుకు కుంగిపోయి పెద్దపెద్ద క్రాక్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. నివేదిక వచ్చాక తదుపరి చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిస్థితిని అంచనా వేసేందుకు పోటాపోటీ పర్యటనలు చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.