Another Case Filed on Radhakishanrao: చేసిన పాపాలు ఊరికే పోవు.. కచ్చితంగా అనుభవించా ల్సిందేనని పెద్దలు తరచూ చెబుతారు. అదే జరిగింది.. జరుగుతోంది కూడా. టాస్క్ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్రావు ఉన్న సమయంలో ఆయన చేసిన లీలలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన టార్చర్ అనుభవించినవాళ్లు బయటకు వస్తున్నారు. తాజాగా రాధాకిషన్రావుపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదైంది.
క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను నలుగురు డైరెక్టర్లకు బలవంతంగా బదిలీ చేయించారనేది ఫిర్యాదులో ప్రధాన పాయింట్. ఈ వ్యవహారంపై ఆ సంస్థ ఫౌండర్ చెన్నుపాటి వేణు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రాధాకిషన్రావు తోపాటు ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లిఖార్జున్, చంద్రశేఖర్, కృష్ణగోపాల్, రాజ్, రవి, బాలాజీ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు.
హెల్త్ కేర్ సంస్థలో వేణు, బాలాజీలు శాశ్వత డైరెక్టర్లగా ఉన్నారు. తాత్కాలికంగా గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. వీరిలో ఎక్కువ వాటా వేణుకు మాత్రమే ఉంది. దాదాపు 60శాతం షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఐదేళ్ల కిందట వేణు పేరిట ఉన్న షేర్లను తక్కువ ధరకు విక్రయించాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు తాత్కాలికంగా ఉన్న డైరెక్టర్లు. ఈ విషయాన్ని వేణు.. గోల్డ్ షిప్ అబోడే సంస్థ సీఈఓ చంద్రశేఖర్కు చెప్పారు. క్రియా సంస్థలో తాను డైరెక్టర్గా చేరితే ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్టవచ్చని చెప్పడంతో అందుకు వేణు ఓకే అన్నాడు. ఈ క్రమంలో కొన్ని షేర్లను చంద్రశేఖర్కి ట్రాన్స్ఫర్ చేశారు వేణు. పరిస్థితి గమనించిన చంద్రశేఖర్.. తాత్కాలిక డైరెక్టర్లతో కుమ్మక్కయ్యారు.
Also Read: Phone Tapping Case : కీలకదశకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు.. ఎవరు ఆ నలుగురు నేతలు ?
సీన్ కట్ చేస్తే.. ఈ వ్యవహారాన్ని 2018న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వేణు. ఈ కేసుని జాగ్రత్తగా గమనించిన అప్పటి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తన స్టాప్తో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారు. చివరకు తాత్కాలిక డైరెక్టర్లు, రాధాకిషన్రావు కలిసి వేణు వద్దనున్న షేర్లను బదలాయించుకుని వదిలేశారు. అంతేకాదు డబ్బులు కూడా భారీ మొత్తంలో వసూలు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు రాధాకిషన్రావు అరెస్ట్ కాగానే ఇదే మంచి సమయమని భావించిన వేణు.. ఈసారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానున్న రోజుల్లో రాధాకిషన్రావు లీలలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి.